New Delhi:సునీతా విలియమ్స్ ప్రయాణానికి మళ్లీ బ్రేక్:అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక నెలల పాటు చిక్కుకుపోయి, ఇంకొన్ని రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు మరో షాక్! వారిని భూమికి తిసుకొచ్చేందుకు బయలుదేరాల్సిన స్పేస్ఎక్స్ మిషన్.. చివరి నిమిషంలో ఆగిపోయింది.
సునీతా విలియమ్స్ ప్రయాణానికి మళ్లీ బ్రేక్
న్యూఢిల్లీ, మార్చి 14
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక నెలల పాటు చిక్కుకుపోయి, ఇంకొన్ని రోజుల్లో భూమికి తిరిగి రావాల్సిన వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లకు మరో షాక్! వారిని భూమికి తిసుకొచ్చేందుకు బయలుదేరాల్సిన స్పేస్ఎక్స్ మిషన్.. చివరి నిమిషంలో ఆగిపోయింది. రాకెట్ లాంచ్ప్యాడ్లో చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బుధవారం క్రూ-10 ప్రయోగాన్ని వాయిదా వేసింది స్పేస్ఎక్స్.బోయింగ్కు చెందిన స్టార్లైనర్లో ప్రయాణించిన తర్వాత వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తొమ్మిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ప్లాన్ ప్రకారం.. అనుభవజ్ఞులైన అయిన వ్యోమగాములు కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఐఎస్ఎస్లో ఉండాలి. కానీ ఇప్పుడు 9 నెలలు దాటేసింది. వారిని అంతరిక్షంలోకి తీసుకెళ్లిన బోయింగ్కు చెందిన స్టార్లైనర్ క్యాప్సూల్ గత ఏడాదే భూమికి తిరిగి వచ్చింది.ఇద్దరు అమెరికా వ్యోమగాములు, జపాన్, రష్యాకు చెందిన ఒక్కొక్క వ్యోమగాములతో కూడిన నలుగురు సభ్యుల బృందంతో కేప్ కెనవెరాల్లోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ క్రూ-10 రాకెట్ని స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 7.48 గంటలకు ప్రయోగించాల్సి ఉంది. కానీ.. కౌంట్డౌన్ సమయంలో రాకెట్ లాంచ్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హైడ్రాలిక్ సిస్టెమ్లో సమస్యలు ఇందుకు కారణం.
ఈ రాకెట్ లాంచ్ మళ్లీ ఎప్పుడు ఉంటుందో స్పేస్ఎక్స్ ప్రకటించలేదు!స్పేస్లో చిక్కుకుపోయిన వ్యోమగాములను త్వరగా తీసుకురావాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ విజ్ఞప్తి చేయడంతో.. ఈ రాకెట్ లాంచ్ని రెండు వారాల ముందుకు తీసుకొచ్చింది నాసా.తొలుత మార్చ్ 26న క్రూ-10 ప్రయోగాన్ని నాసా షెడ్యూల్ చేసింది. కానీ రెడీగా ఉన్న స్పేస్ఎక్స్ క్యాప్సూల్ని స్వాప్ చేయడం ద్వారా మిషన్ను వేగవంతం చేసింది. కొత్త సిబ్బంది ఐఎస్ఎస్కి చేరుకున్న తర్వాత, విల్మోర్- విలియమ్స్, నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యా వ్యోమగామి అలెగ్జాండర్ గోర్బునోవ్.. ఇప్పటికే సెప్టెంబర్ నుంచి ఐఎస్ఎస్లో ఉన్న (క్రూ -9 మిషన్) క్యాప్సూల్ ఉపయోగించి భూమికి తిరిగి వస్తారు.బోయింగ్ స్టార్లైనర్ని పరీక్షించిన తొలి వ్యోమగాములుగా విల్మోర్, విలియమ్స్ జూన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అయితే, ప్రొపల్షన్ సిస్టమ్ పనిచేయకపోవడం వల్ల వారు స్పేస్క్రాఫ్ట్లో తిరిగి రావడం చాలా ప్రమాదకరంగా మారింది. అందుకే ఐఎస్ఎస్లో ఉండిపోయారు. దీనికి బదులుగా స్పేస్ఎక్స్ క్యాప్సూల్లో వారిని భూమి మీదకు రప్పించాలని నాసా నిర్ణయించింది.స్టార్లైనర్ అభివృద్ధి 2019 నుంచి నిరంతర సాంకేతిక సమస్యలు, బడ్జెట్ పెరుగుదలను ఎదుర్కొంది. ఇది ప్రోగ్రామ్ని గణనీయంగా ఆలస్యం చేసింది. దీనికి విరుద్ధంగా, కనీసం 4 బిలియన్ డాలర్ల విలువైన నాసా ఒప్పందం కింద అభివృద్ధి చేసిన స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్ చాలా సంవత్సరాలుగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఐఎస్ఎస్కి సిబ్బందిని పంపించేందుకు ఉపయోగంలో ఉన్న ఏకైక యూఎస్ వ్యోమనౌకగా ఈ స్పేస్ఎక్స్ క్రూ డ్రాగన్.చాలా నెలల తర్వాత భూమి మీదకు తిరిగి వస్తుండటంతో సునీతా విలియమ్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇప్పుడు మిషన్ వాయిదా పడింది!