Hyderabad:భానుడి ఉగ్రరూపం:తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఈ ఏడాది చాలా త్వరగా ఎండా కాలం సీజన్ మెుదలైంది. జనవరి చివరి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి నుంచి పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
భానుడి ఉగ్రరూపం..
హైదరాబాద్, ఫిబ్రవరి 23
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఈ ఏడాది చాలా త్వరగా ఎండా కాలం సీజన్ మెుదలైంది. జనవరి చివరి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇక ఫిబ్రవరి నుంచి పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 తర్వాత కాలు బయటపట్టేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుండటంతో హైదరాబాద్తో పాటు పలు ప్రధాన నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్యాహ్నం పూట ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మార్చి 1 నుంచి తెలంగాణ నిప్పుల కుంపటిగా మారటం ఖాయమని అంటున్నారు. రానున్న 5 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత తక్కువగా ఉన్నా.. ఆ తర్వాత మాత్రం భానుడి భగభగలు తప్పవని అంటున్నారు. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 35.3 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు.
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేటలో అత్యధికంగా 38.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్పూర్లో 38.1 డిగ్రీలు, నిర్మల్ జిల్లా గింగాపూర్లో 38.1 డిగ్రీలు, నాగర్కర్నూల్ జిల్లా పెద్దముద్నూర్లో 38 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డయింది.ఇక ఎండల తీవ్రతతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. శుక్రవారం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 16,293 మెగావాట్లు నమోదైనట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. ఇలా అత్యధిక డిమాండ్ నమోదవడం ఫిబ్రవరి నెలలో ఇది నాలుగోసారని చెప్పారు. గత ఏడాది మార్చి 8న అత్యధిక డిమాండ్ 15,623 మెగావాట్లు నమోదు కాగా.. ఫిబ్రవరి 5న 15,820 మెగావాట్లు నమోదై ఆ రికార్డును దాటేసింది. మళ్లీ ఈ నెలలోనే 10, 19 తేదీల్లో అంతకుమించి నమోదైనట్లు చెప్పారు.తాజాగా శుక్రవారం మళ్లీ అత్యధిక డిమాండ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఎప్పుడూ మార్చిలో అత్యధిక డిమాండ్ నమోదయ్యేదని.. ఈసారి మాత్రం ముందే నమోదైనట్లు చెప్పారు. ఇక ఎండలకు బయటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఉదయం 11 తర్వాత బయటకు వెళ్లేకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. చల్లని ప్రదేశాల్లో ఉండాలని.. వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.