కర్నూలులో ప్రైవేట్ గోల్డ్ మైనింగ్
కర్నూలు, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్)
ఏపీలో తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో ఈ బంగారం మైనింగ్, ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిబ్రవరి 18వ తేదీన ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ ప్లాంట్ కోసం జియోమైసూర్ అండ్ డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ రెండేళ్ల నుంచి పైలెట్ ప్రాజెక్టు పనులు చేపట్టాయి. ఎట్టకేలకు త్వరలోనే ఈ ప్లాంట్ ద్వారా కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇక జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్లాంట్ కోసం ఏపీ ప్రభుత్వం ఈ నెలలోనే ప్రజాభిప్రాయాన్ని సేకరించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పర్యావరణ అనుమతులు లభిస్తే.. మూడు నెలల్లోగా ఈ ప్లాంట్ నుంచి బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోపైపు ఈ ప్లాంట్ ద్వారా ఏడాదికి 750 కేజీల బంగారం ఉత్పత్తి చేయాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.1994లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లాలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం ఈ బంగారం తవ్వితీసేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించారు. అయితే భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తుందనే కారణంతో ప్రైవేట్ కంపెనీలు ముందుకు రాలేదు. ప్రాథమిక అధ్యయనాలు జరపడానికి కూడా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందనే కారణంతో వెనకడుగు వేశాయి.
అయితే 2005లో కేంద్రం మైనింగ్ లీజ్ ప్రక్రియను సులభతరం చేసింది. ఓపెన్ లైసెన్సింగ్ పాలసీ తెచ్చింది. అనంతరం మరోసారి ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన జియోమైసూర్ సర్వీసెస్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. 2013లో జొన్నగిరి మండలంలో ట్రయల్స్ జరిపేందుకు ప్రాథమిక అనుమతి సంపాందించింది. అయితే పైలెట్ ప్రాజెక్టు చేపట్టేందుకు కావాల్సిన అన్ని అనుమతులు పొందడానికి సుమారు పదేళ్లు పట్టింది.జియోమైసూర్ సర్వీసెస్ లిమిటెడ్లో భాగస్వామిగా ఉన్న డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకుంది. అనంతరం 1500 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నారు. అలాగే తుగ్గలి, మద్దికెర మండలాల్లో 750 ఎకరాల భూమిని కొనుగోలు చేసి.. 2021లో పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుని బంగారం వెలికితీత పనులు ప్రారంభించారు. సుమారు రెండేళ్ల పాటు పైలెట్ ప్రాజెక్టు పనులు చేపట్టిన తర్వాత ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా వాణిజ్యపరమైన కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు.