Vizianagaram | 20 నుంచి పైడితల్లి ఉత్సవాలు | Eeroju news

pydithalli jatara

20 నుంచి పైడితల్లి ఉత్సవాలు

విజయనగరం, సెప్టెంబర్ 19, న్యూస్ పల్స్)

Vizianagaram

ఉత్తరాంధ్ర ఇల‌వేల్పు, విజ‌యన‌గ‌రం ప్రజ‌ల ఆరాధ్య దేవ‌త శ్రీ పైడిత‌ల్లి అమ్మవారి జాత‌ర మ‌హోత్సవం సెప్టెంబ‌ర్ 20 నుంచి అక్టోబ‌ర్ 30 వ‌ర‌కు నిర్వహించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 30న ఉద‌యం 8 గంట‌ల నుంచి దీక్షల విర‌మ‌ణ ఉంటుంది. దేవ‌స్థానం ఛైర్మన్‌, ప్రభుత్వ పెద్దలు, జిల్లా అధికారులు, భ‌క్తుల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో ఉత్సవాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పండగ‌గా ప్రక‌టించినందున అమ్మవారికి టీటీడీ, ప్రభుత్వం ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తాయి. సెప్టెంబ‌ర్ 20న ఉద‌యం 8 గంట‌ల‌కు చ‌దురుగుడి వ‌ద్ద పందిరి రాట‌, మండ‌ల దీక్షతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉద‌యం 11 గంట‌ల‌కు వ‌నం గుడి వ‌ద్ద ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.

అక్టోబ‌ర్ 10న అర్ధమండ‌ల దీక్షలు ప్రారంభం అవుతాయి. అక్టోబ‌ర్ 14న తొలేళ్ల ఉత్సవం, అక్టోబ‌ర్ 15న సిరిమానోత్సవం, అక్టోబ‌ర్ 22న తెప్పోత్సవం, అక్టోబ‌ర్ 27న క‌ల‌శ‌జ్యోతుల ఊరేగింపు, అక్టోబ‌ర్ 29న ఉయ్యాల కంబాల ఉత్సవం, అక్టోబ‌ర్ 30న వ‌నంగుడిలో చండీహోం, పూర్ణాహుతి, దీక్ష విర‌ణ‌మతో ఉత్సవం ముగియ‌నుంది.

ఉత్తరాంధ్ర ప్రజ‌ల క‌ల్పవ‌ల్లి శ్రీ పైడిత‌ల్లి అమ్మవారి తెప్పోత్సవం అక్టోబ‌ర్ 22న సాయంత్రం విజ‌య‌న‌గరం ప‌ట్టణంలోని పెద్ద చెరువులో మంగ‌ళ వాయిద్యాల న‌డుమ‌, సంప్రదాయ బ‌ద్ధంగా క‌న్నుల పండువ‌గా నిర్వహిస్తారు. పైడిమాంబ తాను వెల‌సిన స్థలంలో పెద్ద చెరువులో హంస వాహ‌నంలో ముమ్మారు విహ‌రిస్తారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసి భ‌క్తులు పుల‌కిస్తారు. నిర్ణీత ముహూర్తంలో పైడిత‌ల్లి ఆల‌యం నుంచి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక ప‌ల్లికిలో తిరువీధోత్సవం నిర్వహించి, పెద్ద చెరువు ప‌డ‌మ‌టి భాగానికి చేర్చుతారు. రంగు రంగుల విద్యుత్ దీపాల‌తో అలంకరించిన హంస‌వాహ‌న ప‌డ‌వ‌పై తెప్పోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఈ ఉత్సవాల‌కు సుమారు ఆరు ల‌క్షల మంది భ‌క్తులు వ‌చ్చే అవ‌కాశముంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ప‌ట్టణంలో 11 ప్రాంతాల్లో సాంస్కృతిక కార్యక్రమాల‌ను ఏర్పాటు చేస్తారు. అలాగే ఈ ఉత్సవాల‌కు రెండు వేల మంది పోలీసుల‌తో బందోబ‌స్తు ఏర్పాటు చేస్తారు. ఎటువంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సుమారు రెండు కోట్లు ఖ‌ర్చు చేస్తామ‌ని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ తెలిపారు. పైడిత‌ల్లి (పైడిమాంబ‌) ఉత్తరాంధ్ర ప్రజ‌ల దైవం, పూస‌పాటి రాజుల ఇల‌వేల్పు. అమ్మవారి దేవాలయం విజ‌య‌న‌గరం ప‌ట్టణంలోని మూడు లాంత‌ర్లు కూడ‌లి వ‌ద్ద నిర్మించారు. అమ్మవారి ఉత్సవాలు 1758లో ప్రారంభ‌మై 250 ఏళ్లగా నిరాటంకంగా కొన‌సాగుతున్నాయి.

1757లో విజ‌య‌ద‌శ‌మి వెళ్లిన మంగ‌ళ‌వారం నాడు విజ‌య‌న‌గరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని ప‌తివాడ అప్పల‌స్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. ఆయ‌నే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వ‌ర‌కు ఆ కుటుంబానికి చెందిన వారే వంశ‌పారంప‌ర్యంగా పూజారులుగా ఉంటున్నారు. ప్రస్తుత పూజారి బంటుప‌ల్లి బైరాగి నాయుడు ఆరో త‌రం వారు. ఈ పూజారే సిరిమానోత్సవంలో సిరిమాను అధిరోహించి భ‌క్తుల్ని ఆశీర్వదిస్తారు. అందువ‌ల్ల పైడితల్లి అమ్మవారి పండగా విజ‌య‌ద‌శ‌మి (ద‌స‌రా) అయిన త‌రువాత వ‌చ్చిన మొద‌టి మంగ‌ళ‌వారం నాడు జ‌రుగుతుంది.

సోమ‌, మంగ‌ళ‌, బుధ‌వారాల్లో ఈ పండ‌గ ఉంటుంది. మంగ‌ళ‌వారం సిరిమానోత్సవం ఉంటుంది. సిరిమానుకు ముందు బెస్తవారి వ‌ల‌, పాల‌ధార‌, తెల్ల ఏనుగు, అంజ‌లి ర‌థం ఉంటాయి. సిరిమాను 33 మూర‌లు ఉంటుంది. చారిత్రాత్మకంగా పైడిత‌ల్లి అమ్మ పెద్ద విజ‌య‌రామ‌రాజు చెల్లెలు. ప‌సిప్రాయం నుంచి ఆధ్యాత్మిక భావాల‌తో దేవీ ఉపాస‌న చేసేది. అన్న పొరుగు రాజ్యమైన బొబ్బిలిపై యుద్ధ స‌న్నహాలు చేయ‌డం, ఆమెను క‌ల‌త పెట్టింది. బ్రిటీష్ కుట్రకు లొంగిపోయిన విజ‌య‌రామ‌రాజు చెల్లెలి యుద్ధ నివార‌ణ ప్రయ‌త్నాల్ని లెక్క చేయ‌లేదు. 1757లో బొబ్బిలిపై యుద్ధం ప్రక‌టించాడు.

వెల‌మ వీరులు త‌మ పౌరుష ప్రతాపాల్ని ఫ‌ణంగా పెట్టి విజ‌య‌మో వీర స్వర్గమో అన్నట్లు పోరాడారు. కానీ విజ‌యం విజ‌య‌రామ‌రాజునే వ‌రించింది. ఆ రోజు రాత్రి దేవి క‌ల‌లో క‌నిపించి అన్న ప్రాణాల‌కు వ‌చ్చే ప్రమాదాన్ని ముందే హెచ్చరించింది. ఉప‌వాస‌దీక్షలో ఉన్న ఆమె ప‌తివాడ అప్పల‌నాయుడు, మ‌రికొంద‌రు అనుచ‌రుల్ని వెంట‌బెట్టుకుని బొబ్బిలి బ‌య‌లుదేరింది. కొద్ది దూరం వెళ్లగానే ఆమె అప‌స్మార‌క స్థితిలోకి జారుకుంది. త‌న ప్రతిమ పెద్ద చెరువు ప‌శ్చిమ భాగంలో ల‌భిస్తుంద‌ని, దాన్ని ప్రతిష్టించి నిత్యం పూజలు, ఉత్సవాలు చేయాల‌ని చెప్పి ఆమె దేవిలో ఐక్యం అయిపోయింది.

pydithalli jatara

 

A review of bonala arrangements in Balkampeta temple | బల్కంపేట ఆలయంలో బోనాల ఏర్పాట్లపై సమీక్ష | Eeroju news

Related posts

Leave a Comment