Brands that don’t change even when governments change | ప్రభుత్వాలు మారినా మారని బ్రాండ్లు | Eeroju news

Brands that don't change even when governments change

ప్రభుత్వాలు మారినా మారని బ్రాండ్లు

విజయవాడ, ఆగస్టు 22 (న్యూస్ పల్స్)

Brands that don’t change even when governments change

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి చంద్రబాబు వచ్చినా మద్యం దుకాణాల్లో విక్రయించే బ్రాండ్లలో మాత్రం మార్పు రాలేదు. బాబు వస్తే అన్ని మారిపోతాయి. నాణ్యమైన మద్యం అందుబాటులోకి వస్తుంది, ధరలు దిగొస్తాయని ఆశించిన మద్యం ప్రియులకు భంగపాటు తప్పలేదు. ప్రభుత్వాలు మారి మూడు నెలలు గడుస్తున్నా టీడీపీ మిత్ర పక్షాలు విమర్శలు గుప్పించిన జే బ్రాండ్లే ఇంకా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు.మద్యం దుకాణాల్లో విక్రయించే బ్రాండ్లను రోజువారీ అమ్మకాల ప్రాతిపదికన ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్‌ డిస్టిలరీల నుంచి కొనుగోలు చేస్తుంది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పాత బ్రాండ్లనే విక్రయించడంలో మతలబు ఏమిటో ఎవరికి అంతు చిక్కడం లేదు. మరోవైపు ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

మద్యం కొనుగోళ్లు, అమ్మకాలలో వినియోగదారుడికి, తయారీదారులకు మధ్య ప్రభుత్వమే మధ్యవర్తిగా ఉన్నపుడు ఇంకా నాసిరకం మద్యం, ఊరు పేరు లేని బ్రాండ్లనే మూడ్నెల్లుగా ఎందుకు విక్రయిస్తున్నారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ధరలను తగ్గించే అంశం కొత్త మద్యం పాలసీలో తీసుకోవాల్సి ఉన్నా, బ్రాండ్ల లభ్యత అంశం మాత్రం బేవరేజీస్ కార్పొరేషన్‌ చేతుల్లోనే ఉంటుంది. మద్యం దుకాణాల్లో విక్రయించాల్సిన బ్రాండ్లను నిర్ణయించే బేవరేజీస్ కార్పొరేషన్ కొన్ని బ్రాండ్లనే ఇప్పటికీ అందుబాటులో ఉంచుతోంది. ఎన్నికలకు ముందు వరకు ఏ బ్రాండ్లనైతే జే బ్రాండ్లుగా తిట్టిపోశారో అవే బ్రాండ్లను ఇప్పటికీ విక్రయిస్తున్నారు. ఇదంతా కొందరి కనుసన్నల్లో వ్యూహాత్మకంగా జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి.

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అక్టోబర్ నుంచి అమల్లోకి రానుంది. మద్యం పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాలను ప్రారంభించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించింది. ఇది కొంత మేరకు సత్ఫలితాలను ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయినా ఫర్లేదు మద్యం అమ్మకాలు ప్రైవేట్‌కు ఇచ్చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. ఇందులో భాగంగానే పాత బ్రాండ్లనే ఇంకా దుకాణాల్లో విక్రయిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. మద్యం విక్రయాల్లో వేల కోట్ల రుపాయల లాభాలు కళ్ల ముందుకు కనిపిస్తుండటంతో వాటిని దక్కించుకునేందుకు రాజకీయ పలుకుబడి ఉన్న లిక్కర్ సిండికేట్లు పావులు కదుపుతున్నాయి.

ప్రైవేట్ మద్యం దుకాణాలను అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడే ప్రమాదం ఉంది. అయితే ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి ఎదురు చెప్పే సాహసం ఐఏఎస్‌ అధికారులు చేయకపోవచ్చు. ప్రైవేట్ దుకాణాలను అనుమతిస్తే డిస్టిలరీ నుంచి నేరుగా దుకాణాలకు నాన్‌ డ్యూటీ పెయిడ్ మద్యం కూడా సరఫరా చేసే ప్రమాదం ఉంటుంది.బేవరేజీస్ కార్పొరేషన్ నుంచి సరఫరా చేసే మద్యం స్థానంలో నేరుగా డిస్టిలరీ నుంచి కొనుగోలు చేసే మద్యాన్ని విక్రయించి లిక్కర్ సిండికేట్లు లాభ పడిన ఉదంతాలు గతంలో కొకొల్లలుగా ఉన్నాయి. ఇక మద్యం దుకాణాలను నేరుగా డిస్టిలరీలే దక్కించుకునే అవకాశం కూడా ఉంటుంది. బినామీ పేర్లతో మద్యం వ్యాపారంలోకి నేరుగా డిస్టిలరీలు ప్రవేశించడం ద్వారా లాభాలను దక్కించుకోడానికి ప్రయత్నిస్తారనే అనుమానాలు ఉన్నాయి.

ప్రైవేట్‌కు మద్యం వ్యాపారాన్ని అప్పగించడం ఎంత మేరకు ప్రభుత్వానికి లాభమనే ఆలోచన లేకుండా ఎక్సైజ్ మంత్రి నుంచి అధికారుల వరకు ప్రైవేట్ రాగం ఆలపించడం వెనుక ముందస్తు ప్రణాళిక ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఏపీలో గత ఐదేళ్లుగా రకరకాల బ్రాండ్లను ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించినా జనం మరో దారి లేక వాటినే కొనుగోలు చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రెట్లు ధరలు పెంచిన ప్రభుత్వం మద్యం తయారీదారుల్ని తన దారిలోకి తెచ్చుకోడానికి రకరకాల అస్త్రాలు ప్రయోగించింది. ఈ క్రమంలో మద్యం మీద కళ్లు చెదిరే ఆదాయం కూడా ప్రభుత్వానికి వచ్చింది. మద్యం డిస్టిలరీలు, అమ్మకాలు, నగదు చెల్లింపులు మాత్రమే చేసినా ప్రభుత్వానికి ఏటా రూ.36వేల కోట్ల ఆదాయం వచ్చింది.

2018-19 నాటికి ఈ ఆదాయం రూ.18వేల కోట్లు మాత్రమే ఉండేది. కేవలం ధరల ఆధారంగానే మద్యం అమ్మకాలు జరిగినా జనం జేబులు ఖాళీ చేసుకుంటూ నాసిరకం మద్యాన్ని విధిలేని పరిస్థితుల్లో కొనుగోలు చేసేవారు. 2019 నాటికి రూ.100లోపు ధర ఉన్న ఐఎంఎఫ్‌ఎల్ మద్యం ధర దాదాపు రెట్టింపు అయ్యింది. పాపులర్ బ్రాండ్లు మొత్తం కనుమరుగై పోయాయి. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వం మద్యం ధరల్ని గాడిన పెడుతుందని భావిస్తే మళ్లీ ప్రైవేట్ దుకాణాలను తెచ్చేందుకు ఉత్సాహం చూపడం పలు అనుమానాలకు తావిస్తోంది. మద్యం ధరల్ని గణనీయంగా తగ్గిస్తామనే ప్రకటన ప్రజలకు ఊరటనిచ్చినా ప్రైవేట్ దుకాణాలతో లాభం ఎవరికనే సందేహాలు లేకపోలేదు.

మద్యం తయారీ మొదలు విక్రయాల వరకు ప్రతి పైసాకు నాలుగైదు రెట్లు లాభాలు ఉండటాయి. దీంతో కొత్త మద్యం పాలసీపై లిక్కర్‌ సిండికేట్లు కన్నేశాయి. ఐదేళ్లుగా మద్యం విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయం చాలా వరకు ప్రభుత్వ ఖజానాకు చేరింది. ప్రభుత్వం విక్రయించిన మద్యం నాణ్యత, ధరలపై ఎన్ని విమర్శలు ఉన్నా మద్యం ద్వారా లభించిన ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగింది.ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త లిక్కర్‌ పాలసీ ప్రవేశ పెడుతుందనే వార్తల నేపథ్యంలో లిక్కర్ సిండికేట్లు జోరుగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే ప్రైవేట్‌ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వ పెద్దల్ని ఒప్పించడంలో అవి సక్సెస్ అయ్యాయి. వీలైనన్ని మద్యం దుకాణాలను దక్కించుకోడానికి సిండికేట్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఐదేళ్లుగా ప్రభుత్వమే నేరుగా మద్యాన్ని విక్రయించడంతో ఆదాయాన్ని కోల్పోయిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, డిస్టిలరీలు కుమ్మక్కై కొత్త పాలసీని ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో మద్యం విక్రయాలను మించిన ఆదాయ మార్గం ప్రభుత్వానికి మరొకటి లేదు. ఏటా రూ.36వేల కోట్ల రుపాయల ఆదాయం ఖజానాకు లభిస్తోంది. ఇందులో నాలుగో వంతు ఉత్పాదక వ్యయంగా పోయినా దాదాపు రూ.27వేల కోట్ల రుపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంగా లభించేది. 2019కు ముందు మద్యం ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయంలో మద్యం దుకాణాలు కూడా భారీగానే లాభపడ్డాయి.

Brands that don't change even when governments change

 

New Liquor Policy | కొత్త మద్యం పాలసీ… | Eeroju news

Related posts

Leave a Comment