KCR in the junction… | జంక్షన్ లో కేసీఆర్… | Eeroju news

Assembly sessions on budget day KCR attended

జంక్షన్ లో కేసీఆర్…

హైదరాబాద్, జూలై 18 (న్యూస్ పల్స్)

KCR in the junction…

టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. ఒకప్పుడు ప్రజాప్రతినిధులకైనా, ప్రజలకైనా కేసీఆర్ దర్శన భాగ్యమే మహా ప్రసాదం అన్నట్లుగా ఉండేది. అపాయింట్ మెంట్ కోసమే గంటల తరబడి వెయిటింగ్. ఒకవేళ ఇచ్చినా నాటి ప్రగతి భవన్ గేటు లోపలికి రావాలని ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. .టైం బాగున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. మరి అదే బ్యాడ్ టైం వస్తే మాత్రం ఇప్పుడు కేసీఆర్ మాదిరే పరిస్థితి ఉంటుంది. మామూలు బ్యాడ్ టైం కాదిది. కేసీఆర్ చౌరస్తాలో ఎందుకు ఉన్నారు.. ఆరామ్ సే ఫాంహౌజ్ లో ఉన్నారు కదా అనుకోవచ్చు. ఉన్నది ఫాంహౌజ్ లోనే అయినా గులాబీ బాస్ బ్రెయిన్ లో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయి. ఎందుకంటే జీవితంలో ఏదైతే కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావొద్దో.. సరిగ్గా ఇప్పుడు అదే సిచ్యువేషన్ వచ్చేసింది.

తిరుగు లేదు, ఎదురు లేదు అనుకున్న సీన్ నుంచి ఏది ముట్టుకున్నా షాక్ తగిలే పరిస్థితే కనిపిస్తోంది. కానీ ఏదో ఒక నిర్ణయమైతే తీసుకోవాలి. అదేంటంటే.. కూతురు కవితవైపు నిలబడడమా… లేదంటే కొడుకు రాజకీయ భవిష్యత్ కు నష్టం లేకుండా చూసుకోవడమా.. ఈ రెండు ఆప్షన్లలో ఒకటైతే కచ్చితంగా తేల్చుకోవాలి. కానీ అదే తేలడం లేదు. అందుకే కేసీఆర్ ఇప్పుడు చౌరస్తాలో ఉన్నారు.ఏం చేస్తే కేసీఆర్ కు రిలీఫ్ దొరుకుతుంది.. ఎటువైపు నిలిస్తే పరిస్థితి కుదుటపడుతుంది.. ఈ లెక్కలను ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు కవిత అరెస్టై తిహార్ జైలులోనే ఉన్నారు. ఈడీ కేసు కాబట్టి బెయిల్ ఎప్పుడు వస్తుందో చెప్పలేని సిచ్యువేషన్. ఇంకోటి సీబీఐ కేసు కూడా ఎలాగో ఉండనే ఉంది. ఈ కేసులో నిందితులందరిపైనా ఈడీ, సీబీఐ రెండు కేసులు ఉన్నాయి. ఒకదాంట్లో బెయిల్ వచ్చినా ఇంకోదాంట్లో జైలులో ఉండాల్సిన సిచ్యువేషన్.

అందుకే తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీం కోర్టు కండీషన్లతో కూడిన బెయిల్ ఇచ్చినా సీబీఐ కేసులో మాత్రం జైలులోనే ఉండాల్సిన పరిస్థితి. కవిత విషయంలోనూ భవిష్యత్ లో అదే జరుగుతుంది. సో ఈ కేసు తెగడం, ఒక కొలిక్కి రావడం, నిందితులకు బెయిల్ రావడం అంటే ఏళ్లకేళ్లు పట్టే వ్యవహారంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా ఏడాదిన్నర నుంచి తిహార్ జైలుకే పరిమితం అయ్యారు. కేసీఆర్ కు గల్లీలో బలం లేదు, ఢిల్లీలో బలం లేకుండా పోయింది. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కలేదు. రాజ్యసభలో మాత్రం నలుగురు ఎంపీలు ఉన్నారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే.. కవితను బయటకు తీసుకురావాలంటే ఢిల్లీ లెవెల్ లో బలమైన లాబీయింగ్ చేయాల్సిందే.

ఏదో మమ అన్నట్లు ఉంటే కుదరని పని. అందుకే కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు. ఎవరెవర్ని కలిశారు.. ఏమేం చేశారన్నది అంతా రహస్యంగానే ఉంది. ఆ మీటింగ్స్ అవుట్ కమ్ ఏంటన్నది కూడా బయటకు రావాల్సి ఉంది. కేసీఆర్ దగ్గర ప్రస్తుతానికి కొన్ని అస్త్రాలే మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో ఓవైపు చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. రేపో మాపో బీఆర్ఎస్ఎల్పీ విలీనం జరిగిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు చూస్తే బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను బీజేపీవైపు తరలించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్న ప్రచారమైతే బలంగానే వినిపిస్తోంది.ఎమ్మెల్యేలు, ఎంపీల తరలింపు సరే.. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారట.

ఎందుకంటే కూతురి విడుదల కోసం ప్రయత్నిస్తే పార్టీని పణంగా పెట్టాల్సిందే అంటున్నారు. అదే చేస్తే కొడుకు కేటీఆర్ రాజకీయ భవిష్యత్ లేకుండా పోతుంది. ఎందుకంటే పార్టీ నిర్మాణం జరిగి.. గత పదేళ్లు అధికారంలో ఉండి చక్రం తిప్పిన కెపాసిటీ కలిగి ఉండి, ఇప్పుడు ఏకంగా మొదటికే చేతులెత్తేయడం అంటే భవిష్యత్ ఏమీ ఉండదు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బలం పుంజుకుంది. ఇంకోవైపు చూస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ స్పేస్ ను బీజేపీ ఆక్రమిస్తూ వస్తోంది. ఇక పూర్తిస్థాయిలో కేసీఆర్ చేతులెత్తేసినా.. కూతురి కోసం పార్టీని ప్రత్యక్షంగా, పరోక్షంగా విలీనానికి సిద్ధపడ్డా ఇక అంతా జరిగిపోతుంది. అందుకే ఈ కథ చాలా దూరం వెళ్తోంది.నిజానికి కేసీఆర్ ను అపర చాణక్యుడిగా ఇన్నాళ్లూ ఆ పార్టీ నేతలు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ అపర చాణక్యం అంతా బయటకు తీసుకురావాల్సిన సిచ్యువేషన్.

నిజానికి కేసీఆర్ తెలంగాణ ఇక వచ్చేస్తుందనగా.. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని అన్నారు. కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ పెద్దల దగ్గరికి రాయబారాలు నడుపుతున్నా కథ ఎక్కడికి వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. కేసీఆర్ కు ఇప్పుడు మొదటి ఆప్షన్ ఇప్పటికిప్పుడు జరగాల్సిన పని ఏంటంటే కవిత బయటకు రావడం. అందుకోసమే కేటీఆర్, హరీష్ రావును వారం రోజుల పాటు ఢిల్లీకి పంపారు. వారిద్దరూ ములాఖత్ అయ్యారు. ఆ మధ్య కవిత ఈ లిక్కర్ కేసులో అప్రూవర్ అవుతారన్న ప్రచారం కూడా జరిగింది. నిజానికి అప్రూవర్ అయిన వారికి వెంటనే బెయిల్ వచ్చింది. కానీ అలా చేస్తే మొదటికే మోసం అనుకుంటున్నారు. అందుకే ప్లాన్ బి అమలు చేస్తున్నట్లుగా ప్రచారమైతే జరుగుతోంది. కేటీఆర్, హరీష్ రావు వారం రోజులు ఢిల్లీలో ఉండి ఏం చేశారన్న విషయాలపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

బీజేపీలో ఎవరిని కలిస్తే పని జరుగుతుందన్న విషయాలపై ముందుగానే ఓ అంచనాకు వచ్చి పార్టీ సంస్థాగత కార్యదర్శి బీఎల్ సంతోష్ ను, అలాగే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లుగా అయితే ప్రచారం జోరందుకుంది. వీరైతేనే మ్యాటర్ ను మోడీ, అమిత్ షా దగ్గర పోస్ట్ చేస్తారని బహుశా అనుకుని ఉండవచ్చంటున్నారు. అయితే గత చరిత్ర చూస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ వచ్చిన ప్రధాని మోడీ.. కేసీఆర్ పై డైరెక్ట్ ఎటాక్ చేశారు. తన కుమారున్ని సీఎం చేస్తానని ప్రతిపాదన తన దగ్గర చేశారని మోడీ అప్పట్లోనే విరుచుకుపడ్డారు. ఇదేమైనా రాచరికమా అని ప్రశ్నించారు. కేసీఆర్ తో పొత్తు ప్రసక్తే లేదన్నారు.అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

కేసీఆర్ ఇప్పుడు తన కుమార్తె కోసం అసాధారణ ప్రతిపాదన ఏదైనా పెట్టి ఉంటే బీజేపీ నిర్ణయం తీసుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పట్లో బీఎల్ సంతోష్ ను ఇరికించే ప్రయత్నం చేసింది నాటి కేసీఆర్ సర్కార్. బీఎల్ ను నిందితుల జాబితాలో చేర్చి విచారించే ప్రయత్నం చేశారు. కానీ అది జరగలేదు. అక్కడికే ఆగిపోయింది. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు బీఎల్ నే ఆశ్రయించే పరిస్థితికి బీఆర్ఎస్ వచ్చిందా అన్న డౌట్లు వినిపిస్తున్నాయి.

 

KCR in the junction...

 

We have provided ideal governance in Anati’s time KCR | అనతి కాలంలోనే ఆదర్శ పాలన అందించాం | Eeroju news

Related posts

Leave a Comment